బోరంచ (మనూర్): సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం బోరంచ గ్రామంలో వెలిసిన శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ తల్లి దేవస్థానంలో త్వరలో జరగనున్న 7 వారాల మహా జాతర పురస్కరించుకొని ఆలయ అభివృద్ధికి భక్తులు భారీగా స్పందిస్తున్నారు. జాతర సందర్భంగా ఆలయానికి విద్యుత్ దీపాలంకరణ (సీరియల్ లైట్స్) ఏర్పాటు చేయడానికి పలువురు దాతలు తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందజేశారు.
మొదటగా, జోగిపేట్ గ్రామానికి చెందిన సావిడి అజయ్ కుమార్ దంపతులు రూ. 11,116/- విరాళంగా అందజేయగా, ఆలయ సిబ్బంది శేఖర్ వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా, మాధ్వార్ గ్రామానికి చెందిన పిట్ల అంజయ్య రూ. 5,111/- విరాళాన్ని అందజేయగా, ఆలయ చైర్మన్ మల్లయ్య గారు వారిని శాలువాతో సత్కరించారు. అలాగే మసాన్ పల్లి గ్రామానికి చెందిన పోతిరెడ్డిపల్లి నారాయణ రూ. 2,000/- ఆర్థిక సహాయాన్ని అందజేయగా, వారికి ఆలయ చైర్మన్ శాలువాతో సన్మానం చేసి అమ్మవారి ఫోటోను బహుమతిగా అందజేశారు.
ఈ సందర్భంగా విరాళాలు అందజేసిన దాతలకు ఆలయ అర్చకులు సిద్ధయ్య స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాతలందరికీ నల్లపోచమ్మ అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ.. ఆలయ చైర్మన్, అర్చకులు, సిబ్బంది, గ్రామ ప్రజలు మరియు భక్తుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడమైనది.

