జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్):
హనుమాన్ జన్మోత్సవం పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఎక్కెల్లిలో వీర హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం మాణిక్ ప్రభు వీధిలోని హనుమాన్ మందిరం నుండి ప్రారంభమైన ఈ యాత్ర భవాని మందిర్ చౌరస్తా మీదుగా రామ మందిరం వరకు భక్తి పారవశ్యంతో కొనసాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన లలిత్ కుమార్ హిందూ బంధువులకు జన్మోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడుతూ.. హిందువులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగం భక్తులలో సరికొత్త ఉత్తేజాన్ని నింపింది.
శోభాయాత్ర పొడవునా ఎక్కెల్లి వీధులన్నీ “జై శ్రీరామ్” నినాదాలతో మారుమోగాయి. వీర హనుమాన్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో వేలాది మంది భక్తులు, హిందూ బంధువులు పాల్గొని ఆంజనేయుని కృపకు పాత్రులయ్యారు. భక్తుల కోలాహలం, డప్పు చప్పుళ్లతో పట్టణం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.